Virat: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మళ్లీ మునపటి ఆటతో రెచ్చిపోతున్నాడు. చాలాకాలంపాటు ఫామ్ లేమితో తంటాలుపడ్డ కోహ్లీ.. ఈ ఏడాది ఆగస్టులో ఆసియా కప్కు ముందు బ్రేక్ తీసుకుని ఈ టోర్నీలో పాల్గొన్నాడు. ఆసియా కప్ నుంచి ఫ్యాన్స్ మునపటి కోహ్లీని చూస్తున్నారు. ఆ టోర్నీలో రాణించిన విరాట్.. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కూడా అలరించాడు. తాజాగా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లలో విఫలమైన ఈ పరుగుల యంత్రం మూడో వన్డేలో మాత్రం సెంచరీతో చెలరేగింది.
బంగ్లాదేశ్తో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ కంటే ముందే ఇషాన్ కిషన్ కూడా డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ ఇద్దరూ కలిసి 290 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంత చేసినా టీమిండియా ఫ్యాన్స్ మాత్రం సంతోషంగా లేరు. మూడేండ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదు.
కోహ్లీ చివరిసారిగా 2019 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత 40 నెలలకు మళ్లీ వన్డేలలో శతకం బాదాడు.అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాత ఉన్న రికీ పాంటింగ్ (71) ని అధిగమించాడు. బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో కోహ్లీ చేసిన సెంచరీ 72వది. వన్డేలో 44వ సెంచరీ. ఇషాన్ కిషన్ కు వన్డేలలో ఇదే తొలి సెంచరీ. ఇంత చేసినా ఫ్యాన్స్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు.
ఎందుకు..?
కోహ్లీ, ఇషాన్ లు శతకాల జాతర చేసినా ఫ్యాన్స్ నిరాశచెందడానికి కారణముంది. భారత్ టీ20 ప్రపంచకప్ గెలుస్తుందని ఫ్యాన్స్ చాలా ఆశలుపెట్టుకున్నారు. కానీ సెమీస్ గండాన్ని భారత్ దాటలేదు. ఆ మెగా టోర్నీ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్.. రెండో టీ20లో సెంచరీ బాదాడు. అప్పుడు కూడా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. అంతకుముందు ఆసియా కప్ లో ఆఫ్గానిస్తాన్ మీద కోహ్లీ సెంచరీ చేశాడు. ఇప్పుడూ అదే వరస. ఇక తాజాగా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత ఇషాన్ – కోహ్లీలు చేసిన సెంచరీలు ఏదో రికార్డుల కోసం తప్ప.. జట్టుకు ఏ మాత్రం పనికిరానివే అని ఫ్యాన్స్ వాపోతున్నారు. చేయాల్సిన గాయాలు చేసి ఇప్పుడు సెంచరీలు చేసి బర్నాల్ రాస్తున్నారా..? అంటూ మండిపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం లేదనే విషయాన్ని టీమిండియా ఎంత త్వరగా గుర్తుంచుకుంటే అంత మంచిదని హితబోధ చేస్తున్నారు.