Perni Nani: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటికి రావాలి అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది వడదెబ్బ కారణంగా మరణించిన విషయం తెలిసిందే. రోజు రోజుకి ఈ వడదెబ్బ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఉదయం 8 అయింది అంటే చాలు విపరీతమైన ఎండలు. అతి తాజాగా అంతటి ఎర్రటి ఎండలో ఒక వృద్ధురాలు కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్ లో నడుస్తూ ఉండడం చూసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని మనసు చలించిపోయింది.
వెంటనే కారు ఆపి ఆమెను కారులో ఎక్కించుకొని నగరంలోని ప్రచెప్పుల షో రూమ్ కి తీసుకెళ్లి ఆమెకి నచ్చిన చెప్పులను కొనిచ్చారు. తాజాగా పేర్ని నాని తన నియోజకవర్గం మచిలీపట్నంలో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంతేకాకుండా చెప్పులు కొనిచ్చిన తర్వాత చెప్పులు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయా? సరిపోయాయా? లేదా అంటూ ఆమెను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెప్పులు కొనిచ్చిన పేర్ని నానికి ఆ వృద్ధురాలు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎప్పుడూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పిగొడుతూ వార్తల్లో నిలిచే ఆయన, ఈ ఒక్క ఘటనతో ప్రజలను తనవైపు ఆకర్షించారు. ఆయన చేసిన మంచి పని పట్ల ఆయన అభిమానులే కాదు, ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. కొందరు ఆ వీడియో పై పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగటివ్ గా స్పందిస్తున్నారు.