Narendra Modi: భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశతో ఉంది. అయితే దానికి అయోధ్య రామాలయం ఆయువు పట్టు కానుందా అంటే? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అపసోపాలు పడుతూ ఉంది. ఏదోలా అధికారాన్ని కొన్ని చోట్ల సంపాదించుకుంటోంది. కానీ ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం ద్వారా మాత్రం కాదు. ఎమ్మెల్యే లను తిప్పుకుని, పార్టీలను చీల్చి అధికారంలో ఉన్నామని అనిపించుకోవడం బీజేపీ చేస్తున్న పని.
మరి ఇలాంటి ఫిరాయింపు దారులు, అవకాశవాద పొత్తులతో నీతిమయమైన పాలన అందిస్తున్నామని బీజేపీ చెబితే నమ్మేది ఎవరు? పార్టీలను ఫిరాయించే ఎమ్మెల్యేలు తమకంటూ ఒక రేటు ఫిక్స్ చేసుకుంటారు. అయితే ఆ రేటును వారిని చేరదీసే పార్టీ చెల్లించాలి. అలాగే అధికారం ఇస్తూ వారికి సంపాదించుకునే అవకాశం అయినా ఇవ్వాలి. లేదంటే వారు ఫిరాయించరు. అలాంటి ఫిరాయింపులతో స్వచ్ఛమైన పాలన సాగుతుందనుకుంటే అంతకు మించిన అమాయకత్వం లేదు. మరి బీజేపీ రాజకీయాలు ఇప్పుడు ఫిరాయింపులు, ఎమ్మెల్యేలను తిప్పుకోవడం, పార్టీలను చీల్చడం.. చుట్టే సాగుతూ ఉన్నాయి. ఎలాగోలా అధికారంలో ఉండాలనుకుంటూ ఇన్ని రోజులుగా తాము తీవ్రంగా విమర్శించిన పార్టీలతో దోస్తీకి కూడా బీజేపీ వెనుకాడటం లేదు.
తమతో చేతులు కలిపితే ఇన్నాళ్లూ తాము అవినీతి పరులని విమర్శించిన వారు కూడా పుణీతులు అవుతారనేది కమలం పార్టీ చెబుతోంది. కాగా మరి గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 90 నుంచి వంద శాతం ఎంపీ సీట్లను ఇచ్చిన రాష్ట్రాల్లో వచ్చే సారి విజయం కోసం కమలం పార్టీ గట్టిగా కష్టపడాల్సిందే అని రకరకాల సర్వేలు, విశ్లేషణలు చెబుతూ ఉన్నాయి. బీజేపీకి 2019 ఎన్నికల్లో మంచి స్థాయిలో ఎంపీ సీట్లను ఇచ్చిన మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ వంటి చోట్ల వచ్చే సారి టైట్ కంటెస్ట్ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలా మొత్తానికి రామ మందిరం వల్ల మోదీ మరోమారు పీఎం కావడం సాధ్యమేనా అనే అంశంపై అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి.