Gudivada Amarnath: ప్రభుత్వాన్ని నడిపించడం కన్నా.. పార్టీని నడించడమే కష్టమని సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మరి ప్రభుత్వాన్నే నడిపించలేని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తే.. నడిపిస్తారా? అది వారికున్న చిత్తశుద్దిపై ఆధారపడి ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొంతమంది చిత్తశుద్దిని పరీక్షించాలి అనుకున్నారేమో కానీ, ఓ ప్రయోగం చేసినట్టు కనిపిస్తోంది.
పార్టీకి చెందిన పలువురు రీజినల్ కో ఆర్డినేటర్లకు పలు పార్లమెంట్ నియోజవర్గాలు, జిల్లాల బాధ్యతలను అప్పగించారు. చెవిరెడ్ది భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ తో పాటు.. ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ గా నియమించారు. ఇక విజయసాయిరెడ్డికి గుంటూరు పార్లమెంట్, నర్సారావుపేట పార్లమెంట్, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. రామసుబ్బారెడ్డికి.. కర్నూలు, నంద్యాల ఎంపీ నియోజకవర్గాల బాధ్యతలు ఇచ్చారు. కడప, రాజంపేట లోక్సభ నియోజకవర్గాల రీజినల్ కోర్డినేటర్ బాధ్యతలు సురేష్బాబుకు అప్పగించారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్ను నియమించారు.
అయితే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ఏపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్ను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అప్పుడు మంత్రి అమర్ నాథ్ కంటతడి పెట్టిన ఘటన పెద్ద ఎత్తున వైరల్ అయింది. తర్వాత
అమర్ నాథ్ పెందుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఆ సీటు మళ్లీ అదీప్రాజ్కే ఇస్తారని తెలుస్తోంది. దీంతో.. అమర్నాథ్కి ఈ సారి టికెట్ దాదాపుగా రాదని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
ఆయనకు రీజినల్ డిప్యూటీ కోర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. చాలా వ్యూహాత్మకంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టికెట్ రాదని తెలిసిన తర్వాత అమర్ నాథ్ ఓ ప్రకటన చేశారు. జగన్ కు నమ్మిన బుంటులా ఉంటానని చెప్పారు. పదవుల కోసం పని చేయడంలేదని.. పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. దీంతో.. ఆయన చిత్తశుద్ది ఎంత ఉందో తేల్చుకుందామని అధిష్టానం ఆయన్ని రీజినల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ గా నియమించింది. నిజానికి రీజినల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ గా మరే ప్రాంతానికి నియమించలేదు. ప్రస్తుతం విశాఖ రీజినల్ కో ఆర్ఢినేటర్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన కింద అమర్నాథ్ పని చేయాల్సి ఉంటుంది. అంటే.. అమర్నాథ్పై నమ్మకం ఉంటే డైరెక్ట్ గా రీజినల్ కో ఆర్డినేటర్ గా నియమించవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
నమ్మకం లేకే.. కేవలం ఆయన చిత్తశుద్ధిని పరీక్షించడానికే కొత్తగా డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్ పదవిని కట్టబెట్టారని టాక్ వినిపిస్తోంది. మరి అమర్ నాథ్ గతంలో చెప్పినట్టు జగన్ కు నమ్మిన బంటులా ఉంటారో లేదో చూడాలి. కానీ, ఆయనకు కూడా వేరే ఆప్షన్ లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఐటీ మంత్రికి మైకు దొరికితే.. ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చాం అని కాకుండా చంద్రబాబు, లోకేష్, పవన్ ను వ్యక్తిగతంగా దూషించడానికే ఎగబడేవారు. కాబట్టి అయితే, వైసీపీలో ఉండాలి. లేదంటే, రాజకీయ సన్యాసం తీసుకోవాలి. మరి అమర్ నాథ్ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.